హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి అందిస్తున్న బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్, ఇతర కోర్సుల్లో అదనంగా 360 సీట్లు పెంచినట్టు వర్సిటీ ప్రకటించింది. కోర్సుల ప్రవేశాల దరఖాస్తు గడువును ఆగస్టు 13 వరకు పొడిగించినట్టు ఉప కులపతి అల్దాస్ జానయ్య తెలిపారు.
ఎప్సెట్-2026లో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గత ఏడాది కొత్తగా ప్రారంభించిన కొడంగల్, హుజూర్నగర్, డిచ్పల్లి కళాశాలల్లో ఈ ఏడాది నుంచి ఒకో కళాశాలలో అదనంగా 120 సీట్లు భర్తీ చేయనున్నట్టు వివరించారు. వివరాల కోసం వర్సిటీ వెబ్సైట్ ను సందర్శించాలని సూచించారు.