హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): వీరశైవ లింగాయత్/లింగబలిజ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద పటేల్, పలువురు లింగాయత్లు జాతీయ బీసీ కమిషన్ను కోరారు. ఢిల్లీలో బుధవారం కమిషన్ నిర్వహించిన అభిప్రాయసేకరణ సమావేశానికి వారు హాజరై రాష్ట్రంలోని వీరశైవ లింగాయత్, లింగబలిజ కులాల వివరాలు అందజేశారు. ఈ కులాలను ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2009లో బీసీ డీ జాబితాలో చేర్చి జీవో 22 జారీచేసిందని వివరించారు. పన్నెండేండ్లు గడిచినా కేంద్రం ఓబీసీ జాబితాలో చేర్చలేదని తెలిపారు. దీంతో ఆ కులంలోని యువకులు విలువైన అవకాశాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓబీసీ జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.