న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ప్రధాని నరేంద్ర మోది సన్నిహిత మిత్రుడిగా పేరొందిన బిలియనీర్ వాణిజ్యవేత్త గౌతమ్ అదానీ మరో వెనుకడుగు వేశారు. తీవ్ర వివాదంలో చిక్కుకున్న అదానీ గ్రూప్ మరో నిధుల సమీకరణ ప్రయత్నాన్ని విరమించుకుంది. రూ.20,000 కోట్ల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీవో) పూర్తిగా సబ్స్క్రయిబ్ అయిన తర్వాత రద్దు చేసుకున్న గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ తాజాగా 122 మిలియన్ డాలర్ల (రూ.1,000 కోట్లు) బాండ్ల ఇష్యూను రద్దు చేసుకున్నట్టు సంబంధిత వర్గాలు శనివారం వెల్లడించాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ తలపెట్టిన తొలి బాండ్ల పబ్లిక్ ఇష్యూ ఇదే. ఈ ఇష్యూ ప్రక్రియలో ఫైనాన్షియల్ బ్రోకింగ్ సంస్థలు ఎడెల్వీజ్ ఫైనాన్షియల్, ఏకే క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్, ట్రస్ట్ క్యాపిటల్ నిమగ్నమై ఉన్నాయి. 2023 జనవరి ఇష్యూ తేవాలన్నది ప్రతిపాదన.
35 శాతం పతనమైన అదానీ బాండ్లు
జనవరి చివరివారంలో అమెరికా హెడ్జ్ ఫండ్ హిండన్బర్గ్ అదానీ గ్రూప్ కార్పొరేట్ అవకతవకలపై విడుదల చేసిన నివేదికతో గ్రూప్ షేర్లు నిలువునా పతనమవుతున్న సంగతి తెలిసిందే. కేవలం ఒకేవారంలో 100 బిలియన్ డాలర్ల విలువను గ్రూప్ కోల్పోయింది. విదేశీ మార్కెట్లలో లిస్టయిన ఇతర అదానీ గ్రూప్ కంపెనీలు అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ బాండ్ల ధరలు సైతం గత వారం రోజులుగా 25-30 శాతం మేర క్షీణించాయి. ప్రతీ ఒక డాలరుకు 35 సెంట్ల వరకూ అదానీ బాండ్లు పతనమయ్యాయి. యూఎస్లో ట్రేడయ్యే బాండ్ల ద్వారా, నాన్-ఇండియన్ ట్రేడెడ్ డెరివేటివ్స్ ద్వారా అదానీ గ్రూప్ కంపెనీలపై షార్ట్ పొజిషన్లు ( ధరలు తగ్గుతాయన్న అంచనాలతో ముందుగానే విక్రయించడం) తీసుకున్నట్టు హిండెన్బర్డ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. గ్రూప్ షేర్లే కాకుండా బాండ్లు కూడా పతనంచెందడంతో బాండ్స్ ఇష్యూ విజయవంతం కాదన్న భయాలతో ఆ ప్రయత్నాన్ని అదానీ ఎంటర్ప్రైజెస్ విరమించుకుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ వారంలో ఆఫ్షోర్ మార్కెట్లో (విదేశీ) అదానీ గ్రీన్ ఎనర్జీ బాండ్పై ఈల్డ్ (బాండ్లకు అభిముఖంగా కదిలే రేఖ) 36 శాతం మేర పెరిగిపోయింది. అంటే బాండ్ ధర అంతమేర పతనమైందన్న మాట. సిటిగ్రూప్, క్రెడిట్ సూసీలు అదానీ డాలర్ బాండ్లను తనఖా పెట్టుకోబోమని ప్రకటించిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ షేర్లు, బాండ్లు సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో ప్రాజెక్టుల మూలధన వ్యయానికి, వచ్చే ఒకటి, రెండేండ్లలో రుణ చెల్లింపుల్ని రీఫైనాన్స్ చేయడానికి నిధులు సమీకరించే సామర్థ్యం అదానీకి తగ్గిపోతుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్
ప్రకటించింది.
అదనపు షేర్ల తనఖాకు సిద్ధం
అదానీ గ్రూప్ తన కంపెనీల షేర్లను వివిధ బ్యాంకుల్లో తనఖా చేసి రుణాలు తీసుకున్నది. షేర్లపై రుణం ఇచ్చేటపుడు ఆ షేరు మార్కెట్ విలువకు 20-30 శాతం తగ్గించిన విలువను బ్యాంక్లు పరిగణనలోకి తీసుకుంటాయి. కానీ ఆ షేరు మార్కె ట్ విలువ పతనమైతే, మరింత తగ్గిపోయిన విలువకు సరిపడా సొమ్మును, లేదా అదనపు సెక్యూరిటీలను తక్షణమే సమర్పించమంటూ రుణగ్రస్తుడ్ని కోరతాయి. లేకపోతే బ్యాంక్లు వాటి వద్ద తనఖా ఉంచుకున్న షేర్లను ఏ ధర ఉంటే ఆ ధరకు విక్రయించివేస్తాయి. అదానీ గ్రూప్ షేర్లు నిలువునా పతనమైన నేపథ్యంలో నగదుకు బదులు అదనపు షేర్లను సమర్పిస్తామంటూ బ్యాంకర్లతో గ్రూప్ చర్చలు జరుపుతున్నదని బ్లూంబర్గ్ తాజా కథనంలో వివరించింది. తనఖా షేర్లపై ఇప్పటివరకూ గ్రూప్కి బ్యాంకర్ల నుంచి మార్జిన్ కాల్స్ (తగ్గిన విలువకు చెల్లింపులు జరపమంటూ పిలుపు) రానప్పటికీ, ముందుగానే ఆ మేరకు అదనపు షేర్లను తనఖా చేస్తామంటూ బ్యాంక్లకు సమాచారం ఇచ్చినట్టు గ్రూప్ ప్రణాళికలు తెలిసిన ఒక వ్యక్తి చెప్పారు. రూ.20,000 కోట్ల ఎఫ్పీవో సైతం రద్దుకావడంతో పరిమితంగా ఉన్న నగదు నిల్వల్ని ఆచితూచి వాడుకోవాలని అదానీయోచిస్తున్నట్టు
సమాచారం.
అదానీ గ్రూపుపై సుప్రీంకు
గౌతమ్ అదానీకి చెందిన రెండు సంస్థలకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) షాకిచ్చింది. గ్రూపునకు సంబంధింది అదానీ పవర్ మహారాష్ట్ర లిమిటెడ్, అదానీ పవర్ రాజస్థాన్, మహారాష్ట్ర ఈస్ట్రన్ గ్రిడ్ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్లపై ఓవర్ ఇన్వాయిసింగ్నకు సంబంధించి వచ్చిన ఆరోపణలు కొట్టివేస్తూ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై డీఆర్ఐ.. సుప్రీంకోర్టుకు వెళ్లింది.
వచ్చే మూడేండ్లలో చెల్లించాల్సింది 4.5 బిలియన్ డాలర్లు
అదానీ గ్రూప్ వచ్చే 2023-24, 2024-25, 2025-26 సంవత్సరాల్లో 4.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.37,000 కోట్లు) రుణాన్ని చెల్లించాల్సి ఉంది. బాండ్, ఈక్విటీ మార్కెట్లలో గ్రూప్ లిస్టెడ్ సెక్యూరిటీల్లో జరుగుతున్న పతనం నేపథ్యంలో ఆ భారీ రుణ చెల్లింపుల వాయిదా కోసం అదానీ గ్రూప్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నదని సమాచారం. ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో పెద్ద చెల్లింపులేవీ లేవని, భారీ చెల్లింపులు వచ్చే రెండు సంవత్సరాల్లో ఉన్నాయని బ్లూంబర్గ్ డాటా వెల్లడిస్తున్నది. వాస్తవానికి హిండెన్బర్గ్ రిపోర్ట్ వెలువడక ముందు కొద్ది వారాలుగా రుణదాతలతో వాయిదా చర్చల్ని గ్రూప్ జరుపుతున్నది. ఆరు రేటింగ్ ఏజెన్సీలు, బ్యాంకింగ్ భాగస్వాములు, బాండ్ హోల్డర్లతో గ్రూప్ లిక్విడిటీ (నగదు) పరిస్థితిని వివరించడానికి గ్రూప్ అధికారులు నిరంతరం కాల్స్లో ఉంటున్నారు. అబుదాభిలో ఒక సంస్థాగత ఫండ్ వ్యక్తిగత సమావేశాన్ని కోరుతున్నదని గ్రూప్ వర్గాలు తెలిపాయని కంపెనీ అధికారులు వివరించారు.
సిమెంట్ కంపెనీల టేకోవర్కు నాలుగు భాగాలుగా రుణం
గత ఏడాది మే నెలలో యూరప్ సిమెంట్ దిగ్గజం హోల్సిమ్ నుంచి అంబుజా సిమెంట్స్, ఏసీసీ కంపెనీలను అదానీ గ్రూప్ 10.5 బిలియన్ డాలర్లకు (రూ.86,000 కోట్లు) కొన్నది. ఇందుకోసం నాలుగు భాగాలుగా రుణం తీసుకున్నది. 3 బిలియన్ డాలర్ల బ్రిడ్జ్ రుణాన్ని, మరో 500 మిలియన్ డాలర్ల రుణం తీసుకున్నది. ఈ రెండింటినీ బాండ్ల జారీ ద్వారా 18 నెలల్లో చెల్లించే వాగ్దానంతో ఈ రుణాల్ని సమీకరించింది. మరో బిలియన్ డాలర్ల మెజ్నైన్ డెట్ (అధిక రిస్క్గల హైబ్రీడ్ రుణం, రుణదాత ఈక్విటీగా మార్చుకునే హక్కు), ఇంకో 500 బిలియన్ డాలర్లను షేర్లు తనఖా చేసి సేకరించింది. ఏసీసీ, అంబుజాలకు వచ్చే నగదు ద్వారా చెల్లింపులు చేసే ప్రణాళికతో ఈ రుణాల్ని గ్రూప్ తీసుకున్నదని, ఈ రుణాలకు ఆ రెండు కంపెనీల షేర్ల ధరలతో లింక్ లేదని బ్యాంకర్లు తెలిపారు.