‘ఉన్నన్ని రోజులూ నాతో సినిమాలు తీసి, హిట్లు ఇచ్చీ, నన్ను సక్సెస్ఫుల్ హీరోని చేశారు నాన్న. ఇప్పుడు భౌతికంగా లేకపోయినా.. ఆయన టైటిల్ ఇచ్చి నన్ను దీవిస్తున్నారు. ఇది బరువుగా, బాధ్యతగా భావిస్తున్నాను’ అన్నారు అల్లరి నరేశ్. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఫరియా అబ్దుల్లా కథానాయిక. మల్లి అంకం దర్శకుడు. రాజీవ్ చిలక నిర్మాత. శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో అల్లరి నరేశ్ ఇంకా మాట్లాడుతూ ‘దర్శకుడిగా మల్లికి ఇది తొలి సినిమానే అయినా, అద్భుతంగా తీశాడు. 32మంది కొత్త దర్శకులతో పనిచేశాను. 31మంది విడుదలకు ముందు టెన్షన్ పడ్డారు. ఒక్క మల్లి మాత్రం చాలా కూల్గా నవ్వుతూ ఉన్నాడు. రాజీవ్ లాంటి నిర్మాతలు తెలుగు పరిశ్రమకు చాలా అవసరం. ఈ సినిమా పెద్ద విజయం సాధించి, మరో పది సినిమాలు ఆయన నిర్మించి పదిమందికి పని ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’ అని అన్నారు. సినిమాకు పనిచేసిన అందరికీ అతిథిగా విచ్చేసిన హీరో అడివి శేషు శుభాకాంక్షలు అందించారు. ఇంకా చిత్ర యూనిట్తోపాటు అతిథులుగా విచ్చేసిన దేవకట్టా, విజయ్ బిన్నీ, బీవీఎస్ రవి కూడా మాట్లాడారు.