Raghubabu | బీఆర్ఎస్ నేత సంధినేని జనార్ధన్రావు యాక్సిడెంట్ కేసులో సినీ నటుడు రఘుబాబు ఇవాళ కోర్టు ఎదుట హాజరయ్యారు. జనార్దన్ రావు భార్య నాగమణి ఫిర్యాదు మేరకు రఘుబాబుపై 304/ఏ సెక్షన్ కింద నల్గొండ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆయన్ను నల్గొండ జిల్లా కోర్టులో హాజరుపరిచారు. కాగా, ప్రస్తుతం ఆయన బెయిల్పై విడుదలయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. నటుడు రఘుబాబు బుధవారం సాయంత్రం బీఎండబ్ల్యూ కారు (కేఏ 03 ఎంపీ 6914)లో హైదరాబాద్ నుంచి నెల్లూరు వైపు వెళ్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రం శివారుకు రాగానే అద్దంకి-నార్కట్పల్లి హైవేపై దుప్పలపల్లి రోడ్డులో ఉన్న దత్తసాయి వెంచర్కు బైక్పై వెళ్తున్న బీఆర్ఎస్ నల్లగొండ పట్టణ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావు(49)ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన జనార్దన్రావు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, యాక్సిడెంట్ జరిగిన సమయంలో రఘుబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ వెంటనే సొంత పూజీకత్తుపై విడుదల చేశారు. తాజాగా ఆయన్ను నల్లగొండ జిల్లా కోర్టు ఎదుట హాజరుపరిచారు.
జనార్దన్ రావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అందులో చురుకైన నేతగా ఎదిగారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్లో చేరారు. కిందటి మున్సిపల్ ఎన్నికల్లో శ్రీనగర్ కాలనీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం నల్లగొండ పట్టణ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కాగా, ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా, జనార్దన్ రావు మృతి పట్ల మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు.