ముంబై : డ్రగ్స్ కేసులో 2021 ఆగస్ట్లో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అరెస్ట్ చేసిన నటుడు ఆర్మాన్ కోహ్లికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీ కత్తుపై జస్టిస్ నితిన్ సంబ్రే కోహ్లికి బెయిల్ మంజూరు చేశారు. కోహ్లి మరోసారి ఇలాంటి నేరానికి పాల్పడినట్టు గుర్తిస్తే బెయిల్ రద్దుకు ప్రాసిక్యూషన్ కోరే స్వేచ్ఛ ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
ఎన్సీబీ కార్యాలయంలో సంతకం చేసేలా కోహ్లిని ఆదేశించాలని ఎన్సీబీ న్యాయవాది శ్రీరాం షిర్సత్ కోరారు. దక్షిణ ముంబైలోని ఎన్సీబీ కార్యాలయంలో నెలకు ఒకసారి హాజరు కావాలని కోహ్లిని న్యాయమూర్తి నితిన్ సంబ్రే ఆదేశించారు. డ్రగ్ వ్యాపారానికి కోహ్లి ఫైనాన్స్ చేస్తున్నట్టు ఎన్సీబీ ఆరోపిస్తోంది. కోహ్లి డ్రగ్స్ సేవించినా ఎలాంటి డ్రగ్స్ ట్రేడ్లో లేనందున అతడిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కఠిన సెక్షన్లు వర్తించవని కోహ్లి న్యాయవాదులు తారక్ సయ్యద్, అభిషేక్ యండే కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.