రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): సమాజంలో మహిళలపై వివక్ష చూపే, దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి హెచ్చరించారు. బాధిత మహిళలు ధైర్యంగా ముందుకొస్తే భద్రత కల్పిస్తామని, మహిళా కమిషన్ వారికి అండగా నిలుస్తుందని చెప్పారు. జాతీయ మహిళా కమిషన్ సహకారంతో రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బిర్లా ఆడిటోరియంలో వివక్ష, దాడులు, సైబర్ నేరాలు తదితరాలపై మహిళలకు అవగాహన కల్పించేందుకు సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మహిళలకు ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తామని తెలిపారు. లింగ నిర్ధారణ చేసే క్లినిక్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ రాధికా జైస్వాల్, సిటీ సివిల్ కోర్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ మురళీ మోహన్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు షహీన్ అఫ్రోజ్, కుమ్ర ఈశ్వరీబాయి, కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ, సుదాం లక్ష్మి, కటారి రేవతిరావు, మహిళా కమిషన్ సెక్రటరీ సునంద, ఆర్జేడీ శారదా, హైదరాబాద్ జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.