టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరిక
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): బస్టాండ్లలోని దుకాణాల్లో నిబంధనలు అతిక్రమిస్తూ ఎంఆర్పీ (గరిష్ఠ చిల్లరధర) కంటే ఎక్కువకు వస్తువులు విక్రయించేవారిపై చర్యలు తప్పవని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ఎంఆర్పీ కంటే ఎక్కువకు విక్రయించినా, నకిలీ, నిషేధిత వస్తువులు విక్రయించినా దుకాణదారుల లైసెన్స్లు రద్దు చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు సజ్జనార్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తున్నట్టు గుర్తిస్తే ప్రయాణికులు వెంటనే స్టేషన్ మేనేజర్కు లేదా కంట్రోలర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఉచితంగా వాడుకునే టాయిలెట్లకు సైతం డబ్బులు వసూలుచేసే వారిపై అధికమొత్తంలో జరిమానాలు విధిస్తామని తెలిపారు. లైసెన్స్ ఒప్పందాల రద్దుకు నోటీసులు జారీచేస్తామని పేర్కొన్నారు. ప్రయాణికుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్లోని మహాత్మాగాంధీ బస్స్టేషన్, జేబీఎస్, సూర్యాపేట, నల్లగొండ, కరీంనగర్, వరంగల్, హన్మకొండ బస్స్టేషన్లలో తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన దుకాణదారులకు రూ.52 వేల జరిమానాతోపాటు నోటీసులు జారీచేసినట్టు వివరించారు.