తాండూరు, నవంబర్ 16: చేసేదే అక్రమ దందా.. దానికి అడ్డొస్తున్నాడని ఓ వ్యక్తిని హత్య చేసేందుకు ప్లాన్ వేశారు.. కారుతో అతడి బైక్ను ఢీకొట్టించి చంపేందుకు ప్రయత్నించారు.. కానీ, అదే బైక్పై వెళ్తున్న వేరే వ్యక్తి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటుచేసుకొన్నది. మంగళవారం తాండూరు రూరల్ సీఐ జలంధర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రాజీవ్కాలనీకి చెందిన షేక్ ఇస్మాయిల్, అబ్దుల్ మోహి కొంతకాలంగా రేషన్ బియ్యం అక్రమ దందా చేస్తున్నారు. ఈ విషయమై సోఫియాన్ పోలీసులకు సమాచారం ఇవ్వటంతో కక్షగట్టారు. అతడ్ని చంపాలని ప్లాన్ వేశారు.
శనివారం అర్ధరాత్రి సోఫియాన్, సోహెన్, జబ్బార్ కలిసి బైక్పై ఇంటికి వెళ్తుండగా గమనించిన ఇస్మాయిల్, మోహి.. కారుతో బైక్ను వేగంగా ఢీకొట్టించారు. ఈ ఘటనలో జబ్బార్ అక్కడికక్కడే మృతిచెందగా, సోఫియాన్, సోహెన్ తీవ్రగాయాలతో దవాఖానలో చేరారు. అది రోడ్డు ప్రమాదం కాదని, ముమ్మాటికీ హత్యేనని ఆదివారం మృతుడి కుటుంబసభ్యులు యాలాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి, విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. రేషన్ దందాకు అడ్డు వస్తున్నాడనే సోఫియాన్ను హత్య చేయాలని కుట్ర చేశామని, కానీ జబ్బార్ మృతిచెందాడని ఒప్పుకొన్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు.