ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండాల గ్రామంలో ఉర్సు ఉత్సవాల్లో ఒకే సామాజిక వర్గం మధ్య తలెత్తిన ఘర్షణలో ఇద్దరు మృతికి కారణమైన 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుండాల గ్రామంలో ఎంపీటీసీ భర్త ముబిన్, సర్పంచ్ భర్త అబ్దుల్ రషీద్ల మధ్య గత కొన్నేళ్లుగా రాజకీయ కక్షలు కొనసాగుతున్నాయి. 27న గ్రామంలో ఉర్సు ఉత్సవాలను నిర్వహిస్తామని అబ్దుల్ రషీద్ వర్గం అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా పోలీసులు నిరాకరించారు. ఉల్లంఘనలను అతిక్రమించి సర్పంచ్ వర్గం డీజే సిస్టమ్, ర్యాలీ నిర్వహించగా ఎంపీటీసీ వర్గం వారు అడ్డుకోవడంతో ఘర్షణ తలెత్తింది.
ఈ ఘర్షణలో అన్నదమ్ములైన షేక్ జైరొద్దీన్ (60) షేక్ హ (55) అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. షేక్ సిరాజ్ తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. దాడులకు పాల్పడిన నిందితులు అబ్దుల్ రషీద్, షేక్ ఆస్లామ్, షేక్ అస్గర్, షేక్ షఫత్, షేక్ సద్దామ్, షేక్ రబ్బన్, షేక్ జుమ్మా, షేక్ మూస, షేక్ హషమ్, షేక్ హామీద్, షేక్ అల్లాఉద్దీన్, షేక్ జలీల్ ఒప్పకున్నారని పేర్కొన్నారు. వీరిని బోథ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చినట్లు వివరించారు. మిగతా నిందుల కోసం హైదరాబాద్, మహారాష్ట్ర, ఆదిలాబాద్ నుంచి ప్రత్యేక బృందాలను రప్పించి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దాడులకు పాల్పడి, పారిపోయిన నిందితులు స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోవాలన్నారు.
ప్రస్తుతం గుండాల గ్రామం పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉందన్నారు. అయిదుగురు సీఐల ఆధ్వర్యంలో రెండు వందల మంది పోలీసుల బలగాలతో పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు ఆయన వివరంచారు. ఈ సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్, ఆసిఫాబాద్ స్పెషల్ బ్రాంచ్ సీఐ కంప రవీందర్, స్థానిక రమేశ్ బాబు, నేరడిగొండ, గుడిహత్నూర్, సిరికొండ మండలాల ఎస్ఐలు సుమన్ భరత్, కృష్ణ కుమార్, ప్రవీణ్ కుమార్ సిబ్బంది ఉన్నారు.