న్యూఢిల్లీ : మురికి కాలువను శుభ్రం చేస్తూ ఇద్దరు వ్యక్తులు మరణించిన ఘటనలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా బాధ్యత వహించాలని ఢిల్లీలో పాలక ఆప్ పేర్కొంది. ఈ విషాద ఘటనకు లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కూడా అయిన వినయ్ సక్సేనానే కారణమని ఆప్ ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు.
డీడీఏ లోక్నాయక్ పురం కాలనీలో ఇద్దరు వ్యక్తులు ఎలాంటి ప్రొటెక్షన్, పరికరాలు లేకుండా కాలువలో దిగారని అన్నారు. ఎల్జీ వినయ్ సక్సేనా నియంత్రణలో ఉన్న డీడీఏ నేరపూరిత నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలను కోల్పోయిన రెండు కుటుంబాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని అన్నారు.
ఢిల్లీ వ్యవహారాల్లో తలదూర్చే ఎల్జీ ఎందుకు వైఫల్యాలపై మౌనంగా ఉన్నారని నిలదీశారు. మురికి కాలువను శుభ్రం చేస్తూ ఇద్దరు వ్యక్తులు మరణించిన ఘటనను ఢిల్లీ హైకోర్టు సుమోటోగా తీసుకున్న క్రమంలో సౌరభ్ భరద్వాజ్ లెఫ్టినెంట్ గవర్నర్ను టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా మురికి కాలువలో దిగిన వ్యక్తి అక్కడి విషవాయువులతో కుప్పకూలాడని, అతడిని కాపాడేందుకు వెళ్లిన సెక్యూరిటీ గార్డు సైతం మరణించాడని భరద్వాజ్ పేర్కొన్నారు.