‘మళ్లీరావా’ ‘దేవదాస్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులు దగ్గరైంది ఆకాంక్ష సింగ్. ఓవైపు వెబ్ సిరీస్లలో బిజీ ఆర్టిస్టుగా ఉంటూ సినిమాల్లో కూడా రాణిస్తున్నదీ భామ. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘షష్టిపూర్తి’ ఈ నెల 30న విడుదలకానుంది. రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి పవన్ప్రభ దర్శకుడు. రూపేష్ నిర్మాత. ఈ సందర్భంగా బుధవారం ఆకాంక్షసింగ్ విలేకరులతో సినిమా విశేషాలను పంచుకుంది. తల్లిదండ్రుల గొప్పతనాన్ని, వారి త్యాగాన్ని తెలియజెప్పే ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడాలని కోరింది.
తన పాత్ర గురించి చెబుతూ ‘ఈ సినిమాలో నేను గ్రామీణ ప్రాంతానికి చెందిన అచ్చ తెలుగమ్మాయి జానకిగా కనిపిస్తా. లంగావోణితో తెరపై కనిపించడం గొప్ప అనుభూతినిచ్చింది. రాజమండ్రి గోదావరి పరిసర ప్రాంతాల్లో నెలరోజులు షూటింగ్ జరిగింది. గోదారి అందాలకు మైమరచిపోయా’ అని చెప్పింది. రాజేంద్రప్రసాద్గారి దగ్గరి నుంచి ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నానని, తామిద్దరం గ్లిజరిన్ అవసరం లేకుండానే ఎమోషనల్ సీన్స్ను రక్తి కట్టించామని, తెలియకుండానే కన్నీళ్లొచ్చేవని ఆకాంక్షసింగ్ పేర్కొంది.