న్యూఢిల్లీ, డిసెంబర్ 15: నకిలీ ఓటరు కార్డులను నిరోధించడం కోసం ఓటర్ కార్డుతో ఆధార్ నంబర్ను అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణలు చేయనుంది. దీనికి సంబంధించిన బిల్లుకు బుధవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అయితే, తాజా బిల్లు ప్రకారం.. ఓటర్ కార్డుతో ఆధార్ లింక్ అనేది స్వచ్ఛందం.
ప్రజలు ఇష్టమైతే లింక్ చేసుకోవచ్చు. లేకపోతే లేదు. ఒకే వ్యక్తి పేర వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ఓటరు కార్డులు ఉండటంపై చాలా కాలం క్రితమే ఎన్నికల సంఘం(ఈసీ) దృష్టిసారించింది. బోగస్ కార్డుల నిరోధానికి ఓటర్ కార్డును ఆధార్తో లింక్ చేయాలని నిర్ణయించింది. దీనిని సుప్రీం కోర్టు తప్పు పట్టింది. ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయకుండా ఆధార్ నంబర్లు సేకరించడానికి ఈసీకి అధికారం లేదని స్పష్టం చేసింది. దీంతో చట్ట సవరణ చేయాలని కేంద్రప్రభుత్వానికి ఈసీ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలోనే తాజా బిల్లు తెచ్చారు.
నాలుగు అవకాశాలు
ఓటర్ జాబితాలో పేరు నమోదుకు ఏటా నాలుగు కటాఫ్ తేదీలు ఉండేలా కేంద్రం వెసులుబాటు కల్పించింది. జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1లను కటాఫ్ తేదీలుగా పేర్కొంది. సర్వీస్ ఓటర్లకు సంబంధించిన నిబంధనలు కూడా మార్చివేశారు. రక్షణ రంగంలో పనిచేసేవారు పురుషులా, స్త్రీలా అన్నది సంబంధం లేకుండా వారి భాగస్వాములను సర్వీస్ ఓటర్లుగా పరిగణించనున్నారు. దీని కోసం చట్టంలో ‘భార్య’ అన్న స్థానంలో ‘భాగస్వామి’ అని మార్చారు. దేశంలో సెమీకండక్టర్ల ఉత్పత్తిని మెరుగుపర్చేందుకు రూ. 76,000 కోట్ల ప్రోత్సాహక విధానానికి బుధవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. భీమ్-యూపీఐ, రూపే డెబిట్ కార్డుల ద్వారా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి రూ.1300 కోట్లతో ఇన్సెంటివ్ పథకానికి బుధవారం కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది.