హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాల రాజపేట మండలం కుర్రారం వద్ద దోసలవాగు వరద ప్రవాహంలో సోమవారం మధ్యాహ్నం ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. స్కూటీపై ముగ్గురు వెళ్తున్న సమయంలో వరద ఉధృతికి సింధూజ, హిమబిందు వాగులో కొట్టుకుపోయారు. మరో యువతిని స్థానికులు కాపాడారు. ఇటుకాలపల్లి నుంచి కుర్రారం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వాగు వద్దకు చేరుకొని.. స్థానికుల సహాయంతో వారి కోసం గాలింపు చేపట్టారు. సాయంత్రం సమయంలో సింధూజ మృతదేహాన్ని పారుపల్లి శివారులో వెలికి తీశారు. మృతురాలు జనగామ జిల్లా చిన్నకోడూరు మండల వాసి. హిమబిందు ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. వరద ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.