కాల్వశ్రీరాంపూర్ : ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న కందకంలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాల్వశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన తాండ్ర సురేశ్(32) కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నాడు. గురువారం ఉదయం అతడు (ఏపీ15ఎల్4878) నంబర్ గల ద్విచక్ర వాహనంపై పని నిమిత్తం పోలీస్ స్టేషన్ వైపు వెళ్తుండగా నీలకంఠ చెరువు సమీపంలో మూలమలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న కందకంలో పడింది.
ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అతడిని మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య సుకన్య, ఇద్దరు కుమార్తెలున్నారు. సురేశ్ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ శ్రీదేవీరాజు కోరారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.