సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రస్థానంగా రక్షణ విభాగాలకు అవసరమైన ఉత్పత్తులను సరఫరా చేస్తున్న సంస్థ ఎంటార్ టెక్నాలజీస్.. భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచి రెండేండ్లకాలంలో మరో వెయ్యి మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 1,500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, వచ్చే రెండేండ్లకాలంలో ఈ సంఖ్య 2,500కి పెంచుకోనున్నట్లు కంపెనీ ఎండీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మరోవైపు సంస్థ క్లీన్ ఎనర్జీ విభాగంలోకి ప్రవేశించింది. ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు, ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ రంగం భారీ వృద్ధిని నమోదు చేసుకుంటున్నదన్నారు. ప్రస్తుతం సంస్థ న్యూక్లియర్ విభాగంలో 14 ఉత్పత్తులు, డిఫెన్స్లో ఆరు, క్లీన్ ఎనర్జీలో మూడు ఉత్పత్తులు కలిగివున్నది.