హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): రైతులకు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి, ఎక్కువ లాభాలను ఆర్జించి పెట్టే పల్లీ (వేరుశనగ) సాగుపై ఇక్రిశాట్ ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే తెలంగాణకు అనుకూలమైన గిర్నార్-4, గిర్నార్-5 రకం పల్లీ విత్తనాలను అభివృద్ధి చేసిన ఇక్రిశాట్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆధునిక పద్ధతుల్లో పల్లీ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇక్రిశాట్ ఆధ్వర్యంలో పల్లీ విత్తనోత్పత్తిపై ఇప్పటికే 300 మంది రైతులకు శిక్షణ ఇవ్వడం విశేషం. దశల వారీగా మరో 600 మంది రైతులకు నూతన వంగడాలతో విత్తనోత్పత్తి సాగు పద్ధతులను బోధించేందుకు కార్యాచరణ రూపొందించారు.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం వేరుశనగ పంటలపై అధ్యయనాలు, పరిశోధనలను ప్రోత్సహించేందుకు అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇక్రిశాట్ సంస్థలకు నిధులను సమకూరుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ అండదండలతో నాగర్కర్నూల్ జిల్లా పాలెంలోని రీజనల్ అగ్రికల్చర్ రిసెర్చ్ స్టేషన్లో పల్లీ సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం తెలంగాణలో సాగు అవుతున్న పంటను రెండింతలు చేసి దిగుబడి పెంచేందుకు తాజా కార్యక్రమం సాయపడుతుందని ఇక్రిశాట్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవైపు స్వచ్ఛందంగా రైతులకు అవగాహన కల్పిస్తూనే.. మరోవైపు రైతు సంఘాల నేతృత్వంలో కొత్త పల్లీ వంగడాలతో సాగును ప్రోత్సహిస్తున్నారు. తద్వారా తెలంగాణకు ప్రత్యేకమైన, నాణ్యమైన పల్లీ విత్తనాలను విస్తృత స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నారు.
తెలంగాణ పల్లీకి డిమాండ్
దేశంలోనే అధికంగా పల్లీ సాగు చేస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఇక్కడ పండించే పల్లీలో నాణ్యత ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. నిరుడు రాష్ట్రవ్యాప్తంగా 2.82 లక్షల ఎకరాల్లో పల్లీ సాగు చేయగా.. ఇందులో అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లాలో దాదాపు 1.4 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో వనపర్తి, మహబూబ్నగర్, నల్లగొండ, వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి.