దుండిగల్, ఏప్రిల్ 29: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో విద్యుత్ శాఖలో వరుస ప్రమాదాలు కలవరం పెడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యమో లేక క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపమో తెలియదు కానీ, లైన్మెన్ల జీవితాలు గాల్లో దీపాలుగా మారుతున్నాయి. కేవలం పది రోజుల వ్యవధిలో ఇద్దరు లైన్మెన్లు విద్యుత్ షాక్కు గురికావడం..అందులో ఒకరు చనిపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
బుధవారం జీడిమెట్ల విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని డి.పోచంపల్లి(దొమ్మర పోచంపల్లి) సెక్షన్లో ఓ ట్రాన్స్ఫార్మర్పై మరమ్మతు పనులు చేస్తుండగా, లైన్మెన్ నాగబాబు ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
సరిగ్గా పదిరోజుల కిందట ఏప్రిల్ 20న బహదూర్పల్లిలో ఇదే తరహా ప్రమాదం చోటు చేసుకుంది. లైన్మెన్ శ్రీనివాస్రావు ట్రాన్స్ఫార్మర్పై పని చేస్తుండగా, కరెంట్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా, వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలపై క్షేత్రస్థాయి సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనులు జరుగుతున్నప్పుడు సంబంధిత ఏఈ పర్యవేక్షణ ఉండడం లేదని, లైన్ క్లియరెన్స్(ఎల్సీ) ఇచ్చే విషయంలో సమన్వయ లోపం లైన్లమెన్ల ప్రాణాల మీదకు తెస్తున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.