హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో తెలంగాణ బిడ్డలతో ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. లే ఆఫ్ల పేరిట కేవలం తెలంగాణవారిపై కక్షగట్టింది. రెండు వారాల్లో 200 మంది వరకు ఉద్యోగులను అకారణంగా తొలగించింది. అదే సమయంలో ఉత్తరాది ఉద్యోగులకు పెద్దపీట వేస్తూ.. రాష్ర్టానికి చెందినవారిపై కత్తిగట్టడం చర్చనీయాంశంగా మారింది. పనిచేసేచోట సైతం యాజమాన్యం వేధింపులకు దిగుతున్నట్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కొత్తూరు, శామీర్పేటలోని నాలెడ్జ్ స్కేర్ పార్క్లో ఉన్న సదరు ప్రైవేట్ ఫార్మా కంపెనీ ఆగడాలు పెరిగిపోవడంతో ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు.
కిందిస్థాయి ఉద్యోగాల్లో మన రాష్ర్టానికి చెందినవారిని నియమించడం, అందులోనూ కొందరినే పర్మినెంట్ పొజిషన్లకు ఎంపిక చేస్తున్నట్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తెలంగాణకు చెందినవారిని అకారణంగా ఒక విభాగం నుంచి మరో విభాగానికి మార్చడం, ప్రొబేషన్ పీరియడ్ను పెంచడం, పనితీరు సరిగ్గా లేదంటూ యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తున్నదని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థ ఉగాది సహా ఇతర ముఖ్యమైన పండుగలకు సెలవులు ఇవ్వడం లేదని సిబ్బంది చెప్తున్నారు. రాష్ట్రం సిద్ధిస్తే అన్నిరంగాల్లో సమాన అవకాశాలు వస్తాయని భావించామని, కానీ తమ ప్రాంతంలోనే తీవ్ర వివక్షకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యోగులతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న సదరు కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై ఇటీవల ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, కార్మికశాఖ ఉన్నతాధికారులకు ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఉద్యోగులపై జరుగుతున్న వివక్ష, వేధింపులపై సమగ్ర విచారణ జరుపాలని ఫిర్యాదులో కోరారు. ఈ వ్యవహారాన్ని ముందుండి నడిపిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.