అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్(CM Jagan) కూటమి నాయకులను తిట్టిన కొలదీ ఇంకా బలంగా మారుతామే తప్ప బలహీన పడమని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. కృష్ణా జిల్లా పెడనలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో కలిసి మాట్లాడారు. కూటమి మధ్య కొట్లాటాలు పెట్టేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని పేర్కొన్నారు.
కూటమి సభ్యులంతా రాజ్యాంగాన్ని (Constitution) నమ్మిన వాళ్లమని, వాటిని పరిరక్షించేందుకు ఎన్ని సవాళ్లైనా ధైర్యంగా ఎదుర్కొంటామని వెల్లడించారు. మత్య్సకారుల పొట్ట కొట్టేందుకు జీవో 217ను తీసుకొచ్చారని దుయ్యబట్టారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జగన్కు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ఏపీ యువత మనస్ఫూర్తిగా కూటమికి మరో అవకాశం ఇవ్వాలని , అనుభవజ్ఞుడైన చంద్రబాబు (Chandra Babu) నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో బలమైన ప్రభుత్వం ఉన్నపుడే అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందని అన్నారు. కూటమి ఏర్పడింది పదవుల కోసం కాదని ప్రజా సంక్షేమానికేనని వివరించారు. మద్యనిషేదం చేస్తానని చెప్పి సారాను, కల్తీ మద్యాన్ని ప్రవహింపజేస్తున్నారని విమర్శించారు. ఇసుక, మద్యం మాఫియాతో వైసీపీ నాయకులు దోచుకుతింటున్నారని తెలిపారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీని ప్రకటిస్తామని అన్నారు.