మాల్దా, నవంబర్ 11: పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లాలో ఒక గ్రామంపై నక్కల గుంపు దాడి చేసింది. హరీశ్చంద్రాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని హర్దాంనగర్ గ్రామంలో గురువారం జరిగిన ఈ ఘటనలో 38 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 20 మంది తీవ్ర గాయపడ్డారని, వారిని స్థానిక దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. తెల్లవారుజామున 15 నుంచి 20 వరకు ఉన్న నక్కల గుంపు గ్రామంలోని పలు ఇండ్లపై దాడికి పాల్పడి అనేక మందిని గాయపరిచాయని పోలీసులు పేర్కొన్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో గ్రామస్తులందరూ ఉలికిపాటుకు గురయ్యారు. వెంటనే తేరుకున్న వారు దొరికిన రెండు నక్కలను కొట్టి చంపేశారు. మిగతావి తప్పించుకు పారిపోయాయి.