న్యూఢిల్లీ, డిసెంబర్ 6: భారత్ శక్తివంతమైన, స్నేహపూర్వక దేశమని, కాలపరీక్షకు నిలిచిన మిత్ర దేశమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొనియాడారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పురోగమిస్తున్నాయని చెప్పారు. సోమవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీతో ఆయన శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, అంతరిక్ష, ఇంధన, హై టెక్నాలజీ తదితర అంశాలతో పాటు ఆఫ్గానిస్థాన్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. ఉగ్రవాదం, డ్రగ్స్ రవాణా వంటి ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేస్తామని పుతిన్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ.. భారత్, రష్యాల మిత్రుత్వం చెక్కుచెదరకుండా సుస్థిరంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. కరోనా సమయంలో పుతిన్ చేపట్టిన రెండో విదేశీ పర్యటన భారత్లోనే కావడం, అది తమ దేశం పట్ల ఆయనకు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు.
అమేఠీలో ఏకే-203 రైఫిళ్ల తయారీ
మోదీ, పుతిన్ సమావేశానికి ముందు రెండు దేశాల రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్, సెర్గీ షోయిగు ద్వైపాక్షిక చర్చలు చేశారు. ఇందులో భాగంగా 28 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. యూపీలోని అమేఠీలో 6 లక్షలకుపైగా ఏకే-203 అసాల్ట్ రైఫిళ్ల తయారీ ఒప్పందం ప్రధానమైనది. సైన్యం కోసం దాదాపు రూ.5 వేల కోట్లతో ఈ రైఫిళ్లు తయారు చేయనున్నారు. దీనితోపాటు సైనిక సహకారాన్ని మరో 10 ఏండ్లపాటు కొనసాగించడం, 2019 ఫిబ్రవరిలో కుదిరిన డీల్ ప్రకారం కలష్నికోవ్ సిరీస్కు చెందిన చిన్నతరహా ఆయుధాల తయారీ ఒప్పందాలు ఈ జాబితాలో ఉన్నాయి. భారత్, రష్యా విదేశాంగ మంత్రులు ఎస్ జయశంకర్, సెర్గే లావ్రోవ్ విడిగా భేటీ అయ్యారు.