‘కథ విన్నప్పుడు అందులో కొత్తదనం ఉందనే భావన నాలో కలగాలి. ఇదివరకు ఎప్పుడూ తెరపై చూడలేదనే అనుభూతికి లోనవ్వాలి. అలాంటి వినూత్నమైన కథాంశాలకే తొలిప్రాధాన్యతనిస్తా’ అన్నారు నవీన్ పొలిశెట్టి. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘జాతిరత్నాలు’. నాగ్ అశ్విన్ నిర్మాత. అనుదీప్ దర్శకుడు. నేడు ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా నవీన్ పొలిశెట్టి చెప్పిన సంగతులివి..
‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’, ‘చిచోరే’ తర్వాత నేను హీరోగా నటించిన చిత్రమిది. గత రెండు సినిమాలు విజయవంతమవ్వడంతో నాపై అంచనాలు పెరిగాయి. వాటిని అందుకోవాలనే భయం మొదలైంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ నేను ఏజెంట్ ఆత్రేయగానే గుర్తున్నా. ఆ ఇమేజ్ నుంచి బయటపడాలనే ఆలోచనతో చాలా కథలు విన్నా. అనుదీప్ చెప్పిన ఈ పాయింట్ నన్ను ఆకట్టుకోవడంతో సినిమాను అంగీకరించా. పూర్తిస్థాయి వినోదభరిత చిత్రమిది. జోగిపేట శ్రీకాంత్గా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా నా పాత్ర కనిపిస్తుంది. అమాయకులుగా కనిపించే ముగ్గురు యువకులు చేసే పనులు నవ్విస్తాయి.
నాగ్ అశ్విన్తో పదేళ్ల నుంచి పరిచయముంది. కెరీర్ తొలినాళ్లలో కలిసి కష్టాలు పంచుకున్నాం. హీరోగా నేను సక్సెస్లను అందుకోవడానికి కంటే ముందు నుంచి నా ప్రతిభను నమ్మారాయన. నాగ్ అశ్విన్తో పాటు ప్రియాంక, స్వప్న నాతో ఈ సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా. లాక్డౌన్ సమయంలో పడిన కష్టాల్ని మరచిపోయి ప్రేక్షకులంతా నవ్వుకుంటూ థియేటర్ల నుంచి బయటకు వస్తే అంతకుమించిన ఆనందం మరేది ఉండదు. నటుడనేవాడు ఒకే రకమైన ఎమోషన్కు పరిమితమైపోకుండా అన్ని రకాల పాత్రలు చేయగలగాలి. కథ బాగుంటే జోనర్తో సంబంధం లేకుండా థ్రిల్లర్, యాక్షన్తో పాటు ఎలాంటి సినిమానైనా చేస్తా. ప్రేక్షకులకు మంచి కథ చెప్పాలన్నదే నా తాపత్రయం.