హాలియా, ఫిబ్రవరి 10 : ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం శాసన సభలో ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించి టూరిజాన్ని మరింతగా అభివృద్ధి పరుచాలన్నారు. గత ఏడాది మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు హాలియా మున్సిపాలిటీకి మినీ స్టేడియం, బుద్ధవనంలో సైకిల్ ట్రాక్ ఏర్పాటుకు హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. మినీ స్టేడియం మంజూరు చేసినందుకు మంత్రి శ్రీనివాస్గౌడ్కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ బుద్ధవనంలో సైకిల్ ట్రాక్ ఏర్పాటు విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదన్నారు. సాగర్లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించి టూరిస్ట్ కేంద్రంగా మరింతగా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.