బెంగళూరు, జూలై 17: కర్ణాటకలోని గదగ్ జిల్లాలోని బలే హూసూర్ గ్రామంలో ఉన్న బస్టాండ్ నేలమట్టమై చాలా ఏండ్లు అవుతున్నది. దీంతో కొత్తది నిర్మించాలని గ్రామస్థులు అధికారులకు పలుసార్లు విజ్ఞప్తి చేశారు. కానీ ఫలితం లేదు. ప్రజాప్రతినిధులు పట్టించుకున్న పాపానాపోలేదు. దీంతో విసిగివేసారిన గ్రామస్థులు చందాలువేసుకొని తాత్కాలిక బస్టాండ్ను నిర్మించారు. దీని ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధుల బదులు బర్రెను తీసుకొచ్చారు. దానితో ప్రారంభించారు.
ఇది చూసినోళ్లు ‘క్యా డబుల్ ఇంజిన్ సర్కార్ హై’ అని వ్యంగ్యస్ర్తాలు సంధించారు. ఈ సందర్భంగా ఓ గ్రామస్థుడు మాట్లాడుతూ ‘రెండేండ్ల నుంచి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగాం. అధికారులకు పలుసార్లు విజ్ఞప్తి చేశాం. అయినా స్పందన లేదు. అందుకే చందాలువేసుకొని తాత్కాలిక బస్టాండ్ను నిర్మించుకున్నాం. ప్రజాప్రతినిధులకు బుద్ధిచెప్పాలన్న ఉద్దేశంతోనే బర్రెతో ప్రారంభించాం’ అని తెలిపారు.