ములుగు రూరల్, మార్చి 13: రైతుల నుంచి రూ.9 కోట్ల విలువైన పంట ఉత్పత్తులు కొనుగోలు చేసిన ఓ అడ్తి వ్యాపారి డబ్బులు చెల్లించకుండా ఉడాయించాడు. న్యాయం చేయాలని బాధితులు ములు గు పోలీసులను ఆశ్రయించారు. ములుగు జిల్లా ములుగు మండలంలోని కాసిందేవిపేటకు చెందిన అడ్తి వ్యాపారి మహ్మద్ ఇబ్రహీం గత సంవత్సరం మిర్చి, పత్తి, వడ్లు పండించిన 300 మంది రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేశాడు. వాటి డబ్బులు ఇవ్వకుండా మాయమాటలు చెబుతూ దాటవేస్తున్నాడు. చివరికి కరోనా పేరు చెప్పి ఉడాయించాడు. దేవగిరిపట్నం రైతులకు రూ.కోటిన్నర, కాసిందేవిపేట రైతులకు రూ.3 కోట్లు, జంగాలపల్లి రైతులకు రూ.30 లక్షలు, ఇంచర్ల రైతులకు రూ.26 లక్షలు, వెంకటాపూర్ మండలం రామాంజాపురం రైతులకు రూ.20 లక్షలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొంపల్లి రైతులకు రూ.30 లక్షలు, చింతలపల్లి రైతులకు రూ.కోటితోపాటు మరికొన్ని గ్రామాల రైతులకు కలిపి మొత్తం రూ.9 కోట్ల వరకు చెల్లించాల్సి ఉన్నదని వాపోయారు. నిందితుడిని పట్టుకొని న్యాయం చేయాలని బాధిత రైతులు విజ్ఞప్తిచేశారు.