న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడిలో కీలకమైన వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ మరో అరుదైన మైలురాయి చేరుకుంది. భారత్లో టీకా తీసుకునేందుకు అర్హులైన వయోజనుల్లో 80 శాతం మంది టీకా రెండు డోసులు తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సుక్ మాండవీయ స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో చారిత్రక మైలురాయిని చేరుకున్నామని మంత్రి శుక్రవారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
అందరికీ ఉచిత వ్యాక్సిన్లు..భారత్లో 80 శాతం అర్హులైన వయోజనులకు టీకా రెండు డోసులు పూర్తయ్యాయని మంత్రి రాసుకొచ్చారు. కొవిడ్-19పై పోరులో భారత్ త్వరలోనే నూరు శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఒమిక్రాన్ వ్యాప్తితో దేశంలో థర్డ్ వేవ్ ప్రబలిన నేపధ్యంలో మంత్రి ఈ ట్వీట్ చేశారు. ఇక థర్డ్ వేవ్ ప్రభావం తగ్గడంతో కొవిడ్-19 నియంత్రణలను సడలించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటివరకూ 171.76 కోట్ల టీకా డోసులు సరఫరా చేశామని, వారివద్ద ఇంకా 11.41 కోట్ల టీకా డోసులు మిగిలిఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక తాజాగా దేశవ్యాప్తంగా 25,920 కరోనా కేసులు బయటపడగా మహమ్మారి బారినపడి ఒక్కరోజులోనే 492 మంది ప్రాణాలు విడిచారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,92,092కు తగ్గింది.