ముంబై, డిసెంబర్ 23: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ ఏడాది ఐపీవోలు పోటెత్తాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఇప్పటిదాకా 63 సంస్థలు పబ్లిక్ ఇష్యూకు వచ్చాయి. ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీవో) ద్వారా ఆయా సంస్థలు ఏకంగా రూ.1,18,704 కోట్ల నిధులను సమీకరించాయి. కరోనా మహమ్మారి ప్రభావ పరిస్థితుల మధ్య గతేడాదైతే కేవలం 15 ఇష్యూలే రాగా, ఆ కంపెనీలు రూ.26,613 కోట్లనే అందుకున్నాయి. ఇక చివరిసారిగా 2017లో అత్యధికంగా రూ.68,827 కోట్ల నిధుల సమీకరణ ఐపీవోల ద్వారా జరిగింది. అయితే ఈ రికార్డు ఈ ఏడాదితో తుడిచిపెట్టుకుపోయినైట్టెంది.
రూ.2 లక్షల కోట్లపైనే
ఈ ఏడాది మొత్తంగా పబ్లిక్ ఈక్విటీ ఫండ్రైజింగ్ రూ.2 లక్షల కోట్ల మార్కును దాటి రూ.2,02,009 కోట్లను తాకింది. ఇందులో రూ.1,03,621 కోట్లు ఫ్రెష్ క్యాపిటల్ రైజింగ్ అవగా, మిగతా రూ.98,388 కోట్లు ఆఫర్ ఫర్ సేల్గా ఉన్నట్టు ప్రైమ్ డాటాబేస్ తాజా నివేదిక స్పష్టం చేసింది. గతేడాది పబ్లిక్ ఈక్విటీ ఫండ్రైజింగ్ రూ.1,76,914 కోట్లుగానే ఉన్నది. అప్పటికి ఇదే ఆల్టైమ్ హై రికార్డవగా, ఈ ఏడాదితో ఇదీ కనుమరుగైపోయింది. ఈ ఏడాది సెబీకి ఐపీవో కోసం మొత్తం 115 సంస్థలు దరఖాస్తు చేసుకున్నట్టు ప్రైమ్ డాటాబేస్ గ్రూప్ ఎండీ హల్దియా తెలిపారు.