హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ)/తెలుగుయూనివర్సిటీ: పేద బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ విద్యను అందించే వివేకానంద విదేశీ విద్య పథకం కింద 62 మంది విద్యార్థులను బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఎంపికచేసినట్టు పరిషత్తు అడ్మినిస్ట్రేటర్ యూ రఘురాంశర్మ తెలిపారు. బ్రాహ్మిణ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కీం ఆఫ్ తెలంగాణ (బెస్ట్) కింద 425 మందిని ఎంపికచేసినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ బొగ్గులకుంటలోని పరిషత్తు కార్యాలయంలో చైర్మన్ డాక్టర్ కేవీ రమణాచారి అధ్యక్షతన పరిషత్తు కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా విదేశీ విద్యాపథకం కింద ఒక్కొక్కరికీ గరిష్ఠంగా రూ.20 లక్షల చొప్పున 62 మందికి రూ.12.40 కోట్ల స్కాలర్షిప్ మంజూరుకు సమావేశం ఆమోదం తెలిపిందని అన్నారు.
బెస్ట్ పథకం కింద 425 మందికి రూ.12.81 కోట్ల రాయితీ మొత్తాన్ని అందించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందులో 31 మందికి ట్యాక్సీ వెహికిల్స్, మరో 8 మందికి ట్రాక్టర్లు మంజూరుచేసిందని వివరించారు. వేదహిత పథకం కింద ఒక పేద వేద పండితునికి రూ.2,500 నెలసరి గౌరవభృతిని అందించేందుకు కూడా కమిటీ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.