న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: దేశంలో పంద్రాగస్టుకల్లా 5జీ టెలికం సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2022 ఆగస్టు 15నాటికి 5జీ సేవలు ప్రారంభయ్యేలా చూడాలంటూ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాల్ని అందుకున్న టెలికం మంత్రిత్వ శాఖ ఈ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. 5 స్పెక్ట్రంకు సంబంధించిన సిఫార్సులను మార్చికల్లా అందచేయాలంటూ టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ని మంత్రిత్వ శాఖ కోరింది. వివిధ బ్యాండ్లలో లభ్యమయ్యే స్పెక్ట్రం వేలం వేసేందుకు ధర, పరిమాణం, ఇతర షరతులపై ట్రాయ్ సిఫార్సుల్ని అందించాల్సి ఉంది. అల్ట్రా హైస్పీడ్ డాటా కోసం ఉద్దేశించిన 5జీ సేవలపై ఇటీవల ట్రాయ్..పరిశ్రమ ప్రతినిధులు, ఇతర భాగస్వాములతో ఒక చర్చా కార్యక్రమం కూడా నిర్వహించింది. ఈ అంశాన్ని పరిశీలించి, త్వరితంగా సిఫార్సుల్ని, అభిప్రాయాల్ని తెలియచేయాలంటూ టెలికం శాఖ.. ట్రాయ్ని ఒక లేఖలో కోరింది.