లక్నో/చండీగఢ్, ఫిబ్రవరి 19: ఐదురాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించిన పంజాబ్లో మొత్తం 117 స్థానాలకు, యూపీలోని 59 సీట్లకు ఆదివారం పోలింగ్ జరుగనున్నది. పంజాబ్లో 1,304 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 93 మంది మహిళలు. రాష్ట్రంలో ఈ దఫా పోటీ రసవత్తరంగా మారింది.
అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోవాలనుకొంటున్న కాంగ్రెస్ విద్యుత్తు, ఇంధన చార్జీలు తగ్గిస్తామంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది. అయితే గత ప్రభుత్వ హయాంలో అవినీతి, డ్రగ్స్ మాఫియా పెచ్చరిల్లడాన్ని విపక్షాలు ప్రధాన అస్త్రంగా మార్చుకొన్నాయి. ఢిల్లీ నమూనాను పంజాబ్లో అమలు చేస్తామని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా 2020లో బీజేపీతో తెగదెంపులు చేసుకొని బీఎస్పీతో జట్టుకట్టిన శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) తమ పార్టీ పంజాబీల ఇంటి పార్టీ అంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది.
డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ నినాదంతో బీజేపీ.. మాజీ సీఎం అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్, సుఖ్దేవ్ సింగ్ నేతృత్వంలోని ఎస్ఏడీ (సంయుక్త)తో కలిసి బరిలోకి దిగింది. పంజాబ్ రైతు సంఘాలకు చెందిన సంయుక్త సమాజ్ మోర్చా కూడా ఈ ఎన్నికల్లో పోటీలో నిలిచింది. ఆదివారం ఎన్నికలు జరుగనున్న మొత్తం 24,740 పోలింగ్ స్టేషన్లలో 2,013 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. 2017లో పంజాబ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు 77, ఆప్కు 20, ఎస్ఏడీ-బీజేపీకి 18 సీట్లు వచ్చాయి.
సమాజ్వాదీకి కీలకం
మూడో దశలో భాగంగా యూపీలోని 59 స్థానాలకు ఆదివారం పోలింగ్ జరుగనున్నది. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బరిలో ఉన్న కర్హల్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఈ దశలోనే పోలింగ్ జరుగనున్నది. ఆయనకు పోటీగా బీజేపీ నుంచి కేంద్రమంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ బరిలోకి దిగారు. అఖిలేశ్ బాబాయి శివపాల్ సింగ్ యాదవ్ పోటీ చేస్తున్న జశ్వంత్నగర్కు కూడా పోలింగ్ జరుగనున్నది. అఖిలేశ్ పోటీచేస్తున్న కర్హల్ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల వద్ద పారామిలిటరీ భద్రత ఏర్పాటు చేయాలని ఈసీకి బీజేపీ విజ్ఞప్తి చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య పోలింగ్ జరుగనున్నది. 2017లో యూపీలోని ఈ 59 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 49, ఎస్పీ 9, కాంగ్రెస్ ఒక్క సీటు గెలుచుకొంది.