ముంబై, ఫిబ్రవరి 16: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ఉద్యోగ నియామకాల్లో జోష్ పెంచింది. వచ్చే ఏడాది కొత్తగా 55 వేల మంది ఫ్రెషర్లను క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా తీసుకోనున్నట్లు కంపెనీ సీఈవో సలీల్ పరేఖ్ తెలిపారు. ఇంజినీరింగ్, సైన్స్ గ్రాడ్యుయేట్లకు టెక్నాలజీ రంగంలో భారీ అవకాశాలున్నాయని, నైపుణ్యం కలిగినవారికి అవకాశాలు బోలేడని నాస్కాం వార్షిక కార్యక్రమంలో ఆయన చెప్పారు. 2021-22లో 55 వేల మంది ఫ్రెషర్లను కాలేజీల నుంచి నియమించుకున్నట్లు, వచ్చే ఏడాది ఇంతకంటే అధిక స్థాయిలో రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. అంతర్జాతీయంగా డిజిటలైజేషన్ కారణంగా ఐటీ సేవలకు డిమాండ్ అధికమవడంతో ఈ ఏడాది ఆదాయంలో 20 శాతం వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఫ్రెషర్లకు 6 నుంచి 12 వారాల పాటు శిక్షణ ఇచ్చి సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. కాలేజీ విద్యార్థులకు అవకాశాలు బోలెడని, టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని మార్చుకుంటే దూసుకుపోవచ్చు.