కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 12: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృతోత్సవ్లో భాగంగా 75 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రానున్నాయి. జేఎన్టీయూహెచ్, నిపుణ, సేవా ఇంటర్నేషనల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ‘మెగా జాబ్ ఫెయిర్’ ను నిర్వహిస్తున్నట్టు నిపుణ సంస్థ ఫౌండర్ సుభద్రారాణి తెలిపారు. 75 వేల మందికి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో తమ సంస్థ జాబ్ ఫెయిర్ను నిర్వహిస్తున్నదని వెల్లడించారు. జేఎన్టీయూహెచ్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో కాలేజీ ఆవరణలో ఈ నెల 18, 19 తేదీల్లో జాబ్ ఫెయిర్ నిర్వహిస్తామని, 150కి పైగా కంపెనీలు పాల్గొంటాయని వివరించారు. టెన్త్, ఇంటర్, బీఈ, బీటెక్, డిగ్రీ/పీజీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ చేసిన నిరుద్యోగులకు ఐటీ, ఐటీఈఎస్, కోర్, మేనేజ్మెంట్, ఫార్మా, బ్యాంకింగ్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించనున్నట్టు తెలిపారు. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదని, నిపుణ వెబ్సైట్ www. nipunahds.com ద్వారా ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. మరిన్ని వివరాలకు 9848484264, 8790006745 నంబర్లను సంప్రదించాలని సూచించారు.