హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): కవి, గాయకుడు, డప్పు కళాకారుడు పైలం సంతోష్ కుటుంబానికి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ రూ.5 లక్షలు అందజేశారు. హైదరాబాద్లోని సారథి కార్యాలయంలో సోమవారం సంతోష్ భార్య మంగమ్మ, కుమార్తె స్నేహలకు ఆ చెక్కును అందజేశారు. అనారోగ్య కారణాలతో గతేడాది మరణించిన సంతోష్ కుటుంబానికి అండగా నిలిచేందుకు సారథి కళాకారులు 550 మంది రూ.5 లక్షల విరాళంగా అందించినట్టు రసమయి తెలిపారు.
ఇప్పటివరకు మృతిచెందిన 10 మంది కళాకారులకు దాదాపు రూ.50 లక్షలు ఇలా సమీకరించుకొని ఇచ్చామని పేర్కొన్నారు. తెలంగాణ ధూంధాంలో పనిచేసిన సంతోష్.. ప్రత్యేక రాష్ట్రం కోసం కాలుకు గజ్జకట్టి, గొంగడి వేసుకొని ప్రదర్శనలిచ్చారని చెప్పారు. ఆయన సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం రాగానే సాంస్కృతిక సారథిలో ఉద్యోగం కల్పించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో కళాకారులు అభినయ శ్రీనివాస్, యశ్పాల్, అంబటి వెంకన్న, బోడ చంద్రప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.