కీవ్: గత రెండేండ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం (Russia-Ukraine War) కొనసాగుతూనే ఉన్నది. ఉక్రెయిన్లోని పోక్రోవ్స్క్ (Pokrovsk) పట్టణంపై రష్యా మిస్సైళ్లతో (Missile Strike) విరుచుకుపడింది. దీంతో 11 మంది సాధారణ పౌరులు మృతిచెందారు. వారిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు ప్రకటించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారని చెప్పారు.
ఎస్-300 మిస్సైళ్లతో రష్యా దాడి చేసిందని, ఆరు భవనాలు నేలకూలయని డొనెట్స్క్ రీజినల్ హెడ్ వాదిమ్ ఫిలాష్కిన్ తెలిపారు. సహాయక చర్యలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాడి జరిగిన పొక్రోవ్స్క్ పట్టణం రష్యా సరిహద్దులకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. యుద్ధం జరగడానికి ముందు ఇక్కడ 60 వేల మంది నివసించేవారు. గత ఆగస్టులో రష్యా బాంబు దాడులతో ఈ పట్టణం ధ్వంసమైంది.