IT Returns | గత ఆర్థిక సంవత్సరా (2021-22)నికి ఐటీ రిటర్న్స్ దాఖలులో సరికొత్త రికార్డు నమోదైంది. గడువు చివరి రోజు (2022 జూలై 31) ఆదివారం రికార్డు స్థాయిలో 72.74 లక్షల మందికి పైగా ఐటీఆర్లు సబ్మిట్ చేశారు. ఈ ఏడాది ఐటీఆర్ ఫైలింగ్ నెమ్మదిగా ప్రారంభమైనా.. నెల రోజులుగా పుంజుకున్నది. చివరి రోజు ఉదయం నుంచి వేతన జీవులు.. పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ ఫైల్ చేయడంలో చురుగ్గా వ్యవహరించారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల వరకు 5.83 కోట్ల మంది ఐటీఆర్లు సబ్మిట్ చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో గత డిసెంబర్ నెలాఖరు నాటికి దాదాపు 5.89 కోట్ల మంది ఐటీఆర్ ఫైల్ చేశారు. గతేడాది ఫైలింగ్స్తో పోలిస్తే ఈ దఫా తక్కువగా నమోదు కావడం గమనార్హం.
చివరి రోజు ఐటీఆర్ ఫైలింగ్లో రికార్డులు నమోదయ్యాయి. సాయంత్రం 4:29:30 గంటల సమయంలో సెకన్కు 570 అత్యధికంగా, రాత్రి 7.:44 గంటల సమయంలో నిమిషానికి గరిష్ఠంగా 9573, సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్య అత్యధికంగా 5,17,030 మంది ఐటీఆర్లు సబ్మిట్ చేశారని ఆదాయం పన్ను విభాగం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
2021-22 ఆర్థిక సంవత్సర ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగింది. తొలి కోటి ఐటీఆర్లు జూలై ఏడో తేదీ నాటికి ఫైల్ అయ్యాయి. క్రమంగా ప్రక్రియ పుంజుకున్నది. గత నెల 22 నాటికి 2.48 కోట్ల మంది దాఖలు చేశారు. ఐటీఆర్ల దాఖలుకు గడువు పొడిగించేది లేదని కేంద్రం తెగేసి చెప్పిన తర్వాత వేతన జీవుల్లో వేగం పెరిగింది. గత నెల 25న నాటికి మూడు కోట్ల మంది ఐటీఆర్ ఫైల్ చేశారు. చివరి రోజు (2022 జూలై 31) 72.74 లక్షల మంది ఐటీఆర్లు దాఖలు చేశారు. ఇంతకుముందు 2019లో గరిష్టంగా చివరి రోజు 49 లక్షల మంది ఐటీ రిటర్న్స్ సమర్పించారు. గత నెలలోనే 5.13 కోట్లకు పైగా ఐటీఆర్లు ఫైల్ అయ్యాయి.
వేతన జీవులు చివరి రోజు వరకు ఐటీఆర్లు సబ్మిట్ చేయడానికి వేచి చూశారు. కరోనా మహమ్మారి కారణంగా ఐటీఆర్లు సబ్మిట్ చేయడానికి వేతన జీవులకు కేంద్రం గత రెండేండ్లుగా వెసులుబాటు ఇచ్చింది. కానీ ఈ ఏడాది కనీసం ఒక్క రోజు కూడా పొడిగించలేదు. వేతన జీవులు, పన్ను చెల్లింపుదారులను బట్టి ఆదాయం పన్ను విభాగం ఏడు రకాల ఐటీఆర్ ఫామ్లు సిద్ధం చేసింది. దీంతోపాటు ఐటీఆర్ల ఫైలింగ్ లోడ్ను అందుకునేందుకు న్యూ ఇన్కం టాక్స్ ఫైలింగ్ పోర్టల్ శక్తిమంతంగా తయారైంది.
మొత్తం 5.83 కోట్ల ఐటీఆర్లలో 50 శాతం అంటే 2.93 కోట్లు ఐటీఆర్-1, 11.5 శాతం ఐటీఆర్-2 అంటే 67 లక్షలు, 10.9 శాతం అంటే 63.35 లక్షలు, ఐటీఆర్ -4 కింద 1.54 కోట్ల మంది (26 శాతం) ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేశారు. గత నెల ఏడో తేదీ నుంచి 31 వరకు (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు) 3.31 కోట్ల (58.77 శాతం) ఐటీఆర్లు దాఖలయ్యాయి. వీటిలో 47 శాతానికి పైగా ఆన్లైన్ ఐటీఆర్ ఫామ్ ద్వారా సబ్మిట్ చేశారు.