భువనేశ్వర్: కరోనా రెండో విజృంభణ వల్ల తీవ్ర ప్రభావానికి గురవుతున్న ఒడిశాలో మే 5 నుంచి మే 19 వరకు 14 రోజులపాటు లాక్ డౌన్ విధించబోతున్నారు. వచ్చే బుధవారం నుంచి రెండు వారాలపాటు లాక్ డౌన్ అమలు అవుతుందని ఒడిశా సర్కారు ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా అమలయ్యే ఈ లాక్డౌన్లో ఆరోగ్యం, ఇతర అత్యవసర సేవలకు మాత్రం లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉంటుంది. కోవిడ్ శృంఖలను తెగ్గొట్టేందుకు ఉద్దేశించిన ఈ లాక్డౌన్ వివిధ స్థాయిల్లో అమలవుతుంది. ఉదయం 7 నుంచి 12 గంటల వరకు పౌరులు తమ ఇంటికి 500 మీటర్ల దూరం వరకు కూరగాయల వంటి నిత్వావసరాలను తెచ్చుకునేందుకు అనుమతిస్తారు. బార్బర్ షాపులు, బ్యూటీ పార్లర్లు, సినిమాహాళ్లు, మాల్స్, జిమ్స్, క్రీడాకేంద్రాలు, స్విమింగ్ పూల్స్, గుళ్లు మూసి ఉంచుతారు. మతపరమైన సమావేశాలు అనుమతించరు. రాష్ట్రం లోపల, బయటికి బస్సుల రవాణాను అనుమతించరు. వారాంతంలో.. అంటే శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు సమపూర్ణ లాక్డౌన్ అమల్లో ఉంటుంది.