నేడు ఉత్సవాలు వైభవంగా ప్రారంభం
10న కల్యాణం.. 11న మహాపట్టాభిషేకం
భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు
భద్రాచలం, ఏప్రిల్ 1: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో శనివారం నుంచి వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శుభకృత్ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా రామాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఆలయం లో ఉగాది పచ్చడిని ఉదయం నుంచి సాయం త్రం వరకు పంపిణీ చేయనున్నారు. సాయం త్రం 4:30 గంటలకు ఆరాధన, సాయంత్రం 6 గంటలకు దర్బారు సేవ పూర్తి చేస్తారు. రాత్రి 8 వరకు నూతన పంచాంగాలకు విశ్వక్సేన ఆరాధన, సరస్వతీ పూజ, లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన, పసుపు, కుంకుమలతో పూజ నిర్వహిస్తారు. అనంతరం వేద పండితులు చెన్నావఝల వెంకటేశ్వర అవధానితో నూతన పంచాంగ శ్రవణం ఉంటుంది. కాగా ఈనెల 10న శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం, 11న మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. కాగా శనివారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండటంతో స్వామివారికి జరిపే నిత్య కల్యాణాలను ఏప్రిల్ 16 వరకు నిలిపివేయనున్నట్టు ఈవో శివాజీ తెలిపారు.
శ్రీరామనవమికి 400 ప్రత్యేక బస్సులు
ఖమ్మం, ఏప్రిల్ 1(నమస్తేతెలంగాణ ప్రతినిధి): శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలానికి 400 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ తెలిపారు. శుక్రవారం రాత్రి ఆయన ఖమ్మంలోని ఆధునిక బస్టాండ్ను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భద్రాచలం, వేములవాడ, అరకు, రామప్ప దేవాలయం వంటి పుణ్యక్షేత్రాలకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశామన్నారు.