హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అటవీశాఖ అధికారులు చేపట్టిన గడ్డిమైదానాల పెంపకంతో రెండేండ్లలో కవ్వాల్, అమ్రాబాద్ టైగర్జోన్ పరిధిలో 40 శాతం శాకాహార జంతువులు పెరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పులులకు సమృద్ధిగా ఆహారం అందుబాటులోకి వచ్చిందని భావిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 5 వేల హెక్టార్లలో గడ్డిమైదానాలు విస్తరించి ఉన్నాయి.
2018లో కవ్వాల్ టైగర్జోన్లో 600 ఎకరాల్లో గడ్డి క్షేత్రాల పెంపకానికి అధికారులు శ్రీకారం చుట్టారు. 2019లో 130 హెక్లార్లలో, 2020లో 200 హెక్టార్లలో, 2021లో 140 హెక్టార్లలో గడ్డి మైదానాల పెంపకం చేపట్టారు. ఇందుకోసం ఏడాదికి రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు ఖర్చుచేశారు. నాలుగేండ్లలో సుమారు రూ.35 కోట్లు ఖర్చు చేశారు.
రాష్ట్రంలోని టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో గడ్డిక్షేత్రాల పెంపకంతో రెండేండ్లుగా శాకాహార జంతువుల సంఖ్య 40 శాతం పెరిగినట్టు అధికారులు గుర్తించారు. జన్నారం డివిజన్ పరిధిలో 495 హెక్టార్ల విస్తీర్ణంలో గడ్డిమైదానాలు ఉన్నట్టు జన్నారం డివిజన్ ఫారెస్టు అధికారి మాధవరావు తెలిపారు. వీటి విస్తరణతో రాబోయే రెండేండ్లలో వన్యప్రాణుల సంతతి మరింత వృద్ధి చెందుతుందని వెల్లడించారు.