ఆదాయ పన్ను అధికారులకు అప్పగింత
చిట్యాల, అక్టోబర్ 20: అక్రమంగా తరలిస్తున్న రూ. 4.11 కోట్ల నగదును నల్లగొండ జిల్లా చిట్యాల పోలీసులు మంగళవారం అర్ధరాత్రి పట్టుకున్నారు. సీఐ శంకర్రెడ్డి కథ నం ప్రకారం.. ఎస్సై నాగరాజుకు అందిన విశ్వసనీయ సమాచారంతో మంగళవారం అర్ధరాత్రి తరువాత ఒంటి గంట సమయంలో చిట్యాల బస్టాండ్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఓ కారులో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా అందులో ఎలాంటి ఆధారాలు లేని రూ.4.11 కోట్ల నగదు లభించింది. ఆ కారులో ఉన్న వారు డబ్బుకు సంబంధించి వివరాలు చెప్పకపోవడంతో వాటిని సీజ్ చేసి ఆదాయ పన్ను అధికారులకు అప్పగించినట్టు సీఐ తెలిపారు. కారులో ఉన్న వ్యక్తులు మహారాష్ట్రకు చెందిన వీరేంద్ర, కర్ణాటకకు చెందిన కన్నబాబుగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి తరలిస్తున్న హవాలా డబ్బుగా పోలీసులు అనుమానిస్తున్నారు.