హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): నీటిపారుదలశాఖపై క్యాబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. ఈ సందర్భంగా పలు ప్రతిపాదనలను ఆమోదించింది.
ఇందులో ప్రధానంగా..
సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ జలాశయం నుండి తపాస్పల్లి జలాశయానికి లింక్ కాలువ తవ్వకానికి రూ.388.20 కోట్లకు ఆమోదం. దీంతో తపాస్పల్లి జలాశయం కింద సిద్దిపేట జిల్లాలో 1,29,630 ఎకరాలకు నికరమైన సాగునీరు అందనున్నది.
వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్దారంలో ఉన్న పెద్దచెరువు పునరుద్ధరణ పనులకు రూ.44.71 కోట్లకు ఆమోదం.
మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించనున్న ఘన్పూర్ బ్రాంచ్ కెనాల్ పనులకు రూ.144.43 కోట్లకు ఆమోదం. ఈ కాలువ ద్వారా ఘన్పూర్, అడ్డాకుల మండలాల్లో 25 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగ నదిపై నిర్మితమవుతున్న చనాకా కోరాటా బ్యారేజీకి సంబంధించి రూ. 795.94 కోట్లకు అంచనా వ్యయాన్ని సవరించడానికి ఆమోదం. ప్రాజెక్టులో ఇప్పటికే బ్యారేజీ నిర్మా ణం పూర్తయింది. పంప్హౌజ్ నిర్మా ణం కొనసాగుతున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో భీమ్పూర్, జైనథ్, భేల, ఆదిలాబాద్ మండలాల్లో 50వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది.
మెదక్ జిల్లాలో నిజాముల కాలంలో నిర్మించిన ఘన్పూర్ ఆనకట్ట కాలువల వ్యవస్థను గతంలో ఆధునీకరించారు. అందులో మిగిలిన పనులను చేపట్టడానికి రూ.50.32 కోట్లతో పరిపాలనాఅనుమతికి క్యాబినెట్ ఆమోదం. ఈ ప్రాజెక్టు కింద మెదక్ జిల్లా లో 25 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది.
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరులోని గోపాలసముద్రం చెరువు పునరుద్ధరణ, సుందరీకర ణ పనులకు రూ.10.01 కోట్లు మంజూరు చేసింది.
గద్వాల జిల్లాలో ప్రతిపాదించిన నలసోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకానికి సవరించిన అంచనా వ్యయం రూ.669 కోట్లకు అనుమతి, ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలవడానికి ఆమోదం.
సూర్యాపేట జిల్లాలో చింతలపాలెం మండలం వెల్లటూరు వద్ద ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ నుంచి నిర్మించతలపెట్టిన ఎత్తిపోతల పథకానికి, పాలేడ్ మండ లం గుండెబోయినగూడెం వద్ద జాన్పహాడ్ బ్రాంచ్ కెనాల్ నుంచి నిర్మించతలపెట్టిన ఎత్తిపోతల పథకాలకు రూ.16.23 కోట్లకు మంత్రివర్గం ఆమోదం.
సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నిధుల సేకరణకు కంపెనీ చట్టం, 2013 ప్రకారం మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు ఆమోదం. ఈ కార్పొరేషన్కు ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఈఎన్సీ (జనరల్), ఈఎన్సీ(గజ్వేల్ ), ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి, ఇరిగేషన్ శాఖ సంయుక్త కార్యదర్శి, సంగారెడ్డి చీఫ్ ఇంజినీర్ డైరెక్టర్లుగా ఉంటారు.
దేవాదుల పథకంలో భాగంగా ఎత్తైన ప్రాంతాలకు సాగునీరు అందించడానికి గండిరామారం చెరువు నుంచి కన్నారం చెరువు వరకు పంప్హౌజ్, కాలువ పనులకు, గుండ్లసాగర్ నుంచి లౌక్యతండా వరకు పైప్లైన్ పనులకు; నశల్ జలాశయం వద్ద పంప్హౌజ్ నిర్మాణానికి రూ.104.92 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.