మొక్కల ఆధారిత ఆహారాలే మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలు, చిక్కుళ్లు లాంటివి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా, పిల్లల్లో సాధారణ ఎదుగుదల, అభ్యాసం, మానసిక స్థితి, దీర్ఘకాలిక ఆరోగ్యానికి తోడ్పడతాయి. అందుకు కావాల్సిన పోషకాలన్నీ వీటిలో పుష్కలంగా ఉంటాయి. అయితే, నేటితరం పిల్లలు.. ఈ ఆరోగ్యకరమైన ఆహారానికి దూరం అవుతున్నారని తాజా అధ్యయనం బయటపెట్టింది. అమెరికాలోని టఫట్స్ విశ్వవిద్యాలయం ఈ అధ్యయనం నిర్వహించింది. ఈ సందర్భంగా.. పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యకరమైన మొక్కల ఆధారిత ఆహార వినియోగం తగ్గుతూ వస్తున్నట్లు గుర్తించింది. ‘బీఎమ్జే గ్లోబల్ హెల్త్’ జర్నల్లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.
ఇందులో భాగంగా.. ‘గ్లోబల్ డైటరీ డేటాబేస్’ నుంచి ఆహార సంబంధిత సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. 185 దేశాల నుంచి 1,200 కంటే ఎక్కువ ఆహార సర్వేల డేటాను ఉపయోగించి రిపోర్టును తయారు చేశారు. 1990 – 2018 మధ్య కాలంలో ఐదు రకాల ఆరోగ్యకరమైన మొక్కల ఆధారిత ఆహారాల వినియోగాలను విశ్లేషించారు. ఆశ్చర్యకరంగా.. పిల్లలు, కౌమారదశలో ఉన్నవారు చాలా తక్కువ మొత్తంలో మొక్కల ఆధారిత ఆహారాన్ని తింటున్నారని పరిశోధకులు కనుగొన్నారు.
ఇందుకు కారణాలను వివరిస్తూ.. పిల్లల్లో ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ సంస్కృతి పెరిగింది. చిప్స్, బర్గర్లు, పిజ్జాలతోపాటు ఇన్స్టంట్గా దొరికే జంక్ ఫుడ్కే పిల్లలు, యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఆధునిక జీవనశైలి, సమయాభావం వల్ల కూడా చాలామంది ఆకుకూరలు, కూరగాయలను తాజాగా వండుకుని తినలేక పోతున్నారు. అంతేకాకుండా.. టీవీలు, సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన ప్యాక్డ్ ఫుడ్స్ ప్రకటనలకు పిల్లలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. ఫలితంగా.. లేనిపోని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.
ముఖ్యంగా, శారీరక, మానసిక ఎదుగుదల లోపించడం, చదువుపై ఏకాగ్రత కోల్పోవడం, చిన్న వయసులోనే ఊబకాయం, మధుమేహం లాంటి సమస్యల్లో చిక్కుకుంటున్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి ఆహారంలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. రోజువారీ భోజనంలో కనీసం ఒక కప్పు కూరగాయలు, పండ్లను భాగం చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. బాల్యంలో ఏర్పడే ఆహారపు అలవాట్లే జీవితాంతం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయనీ, అందుకు తగ్గట్టుగా పిల్లలను ప్రోత్సహించాలని అంటున్నారు.