యాదగిరి గుట్ట క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. క్యూ కాంప్లెక్స్లు, మాఢవీధులు కిక్కిరిసి పోయాయి. సుమారు 38 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థాన ఖజానాకు రూ.50,64,604 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.
యాదగిరిగుట్ట, మార్చి12 : పంచనారసింహుడి క్షేత్రం ఆదివారం భక్తజనసంద్రంగా మారింది. ఎటుచూసినా భక్తులే దర్శనమిచ్చారు. వరుసగా రెండ్రోజుల సెలవుతోపాటు ఆదివారం కావడంతో స్వయంభూ నారసింహుడి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరుమాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలోని క్యూలైన్లు భక్తులతో సందడిగా మారాయి. ప్రసాద విక్రయశాలలో సందడి నెలకొన్నది. కొండపైకి వాహనాల రద్దీ పెరిగింది. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. అనంతరం మొదటి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం వైభవంగా జరిగింది. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. స్వామివారిని సుమారు 38 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ధర్మదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. అన్ని విభాగాలు కలిపి స్వామివారి ఖజానాకు రూ. 50,64,604 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
లక్ష్మీనరసింహుడి సేవలో ప్రముఖులు..
లక్ష్మీనరసింహుడి సేవలో ప్రముఖులు పాల్గొని తరించారు. గుజరాత్ రాష్ర్టానికి చెందిన ఐపీఎస్ అధికారి శ్రీహరేశ్ దద్దత్తోపాటు మరో నలుగురు ఐపీఎస్లు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. రాష్ట్ర ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వారికి అర్చకులు ఆలయ సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు.