హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా సాగుతున్నది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,700 కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 37 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. నిజామాబాద్, కామారెడ్డితో పాటు రెండు మూడు జిల్లాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్టు అధికారులు తెలిపారు. కొనుగోళ్లలో వేగం పెంచేందుకు అవసరమైతే అదనపు కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలతో ధాన్యం తడవడంతో కొన్ని ఇబ్బందులు ఏర్పడిన విషయం తెలిసిందే. తేమ శాతం తక్కువగా ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలనేది ఎఫ్సీఐ నిబంధన. దీంతో తడిసిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ఆరబెడుతున్నారు. నిబంధనల ప్రకారం ఉన్న ధాన్యాన్ని అధికారులు వెంటనే కొనుగోలు చేస్తున్నారు.