Lavanya Tripathi |గత ఏడాది జరిగిన ‘బ్రహ్మానందం’ సినిమా ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన సరదా వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఇంటికి వెళ్తే “లేడీస్ హాస్టల్ వార్డెన్లా ఉంటాను” అంటూ కుటుంబంలో మహిళల ప్రాధాన్యత గురించి సరదాగా చెప్పిన ఆ వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. ఆ కామెంట్స్ మళ్లీ తాజాగా ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు బాబు పుట్టిన సందర్భంగా ఆ పాత వీడియోలను తీసుకువచ్చి చిరంజీవిని ట్రోల్ చేయడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మెగా కోడలు, వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో గట్టిగా స్పందించారు.
కుటుంబానికి సంబంధించిన సంతోషకరమైన క్షణాలను కూడా వివాదాస్పదం చేయడం సరికాదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. చిరంజీవి మహిళలను ఎంత గౌరవంగా చూస్తారో తెలియకుండా విమర్శలు చేయడం బాధాకరమని, ఇతరులను విమర్శించే ముందు వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని ట్వీట్ రూపంలో పేర్కొన్నారు. తాజాగా మరోసారి ఈ అంశంపై స్పందించిన లావణ్య “మా కుటుంబం జోలికి ఎవరైనా వస్తే అస్సలు ఊరుకోను” అంటూ స్పష్టం చేశారు. చిరంజీవి తన కుటుంబంలోని మహిళలను, ముఖ్యంగా మనవరాళ్లను ఎంతో ప్రేమగా చూసుకుంటారని, ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడే వారు ఆయన చేసిన సేవల్లో ఒక్క శాతం కూడా చేయలేరని ఘాటుగా వ్యాఖ్యానించారు.
“If anyone says anything about my family, I won’t tolerate it. That’s why I reacted” అంటూ ఆమె చేసిన ఆంగ్ల ట్వీట్ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. ఇదిలా ఉండగా పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటిస్తున్న తాజా చిత్రం ‘సతీ లీలావతి’పై కూడా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో లావణ్య సరసన దేవ్ మోహన్ హీరోగా నటిస్తుండగా తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్పై నాగమోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తంగా కుటుంబ గౌరవం విషయంలో లావణ్య త్రిపాఠి తీసుకున్న స్టాండ్ మెగా అభిమానులను ఆకట్టుకుంటుండగా సోషల్ మీడియాలో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది.