Parthiban | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2026 మార్చి 26న గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో వేగంగా పనులు సాగుతున్నాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విలన్ పాత్రధారి ఫస్ట్ లుక్ను చిత్ర బృందం విడుదల చేయడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తమిళ నటుడు పార్థిబన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు.
విడుదల చేసిన క్యారెక్టర్ పోస్టర్లో పార్థిబన్ ఎంతో భయానకంగా, పవర్ఫుల్ లుక్లో దర్శనమిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రంలో ఆయన పోషిస్తున్న పాత్ర పేరు ‘నల్ల నాగప్ప’. రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్న పార్థిబన్ పాత్ర కథలో కీలకంగా ఉండబోతుందనే సంకేతాలు ఫస్ట్ లుక్ నుంచే స్పష్టమవుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ -పార్థిబన్ మధ్య జరిగే ఫేస్ ఆఫ్ సన్నివేశాలను దర్శకుడు హరీష్ శంకర్ ఎలా డిజైన్ చేశారో చూడాలని అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్కు మంచి స్పందన లభించగా, త్వరలోనే రెండో పాటను కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కథన రచన బాధ్యతలను దర్శకుడు దశరథ్ నిర్వహిస్తున్నారు.
ఈ చిత్రంలో ఆశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. భారీ తారాగణం, పవర్ఫుల్ యాక్షన్ అంశాలు, రాజకీయ బ్యాక్డ్రాప్ కలగలిపిన ఈ చిత్రం 2026లో అత్యంత ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలుస్తోంది. విడుదలకు ముందే విలన్ ఫస్ట్ లుక్తో హైప్ పెంచిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.