బేగంపేట, నవంబర్ 25: కేవలం 24 గంటల్లోనే ముగ్గురికి ఊపిరితిత్తులను విజయవంతంగా మార్పిడి చేశారు.. సికింద్రాబాద్ కిమ్స్ దవాఖాన వైద్యులు. గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలలో నిపుణుడు డాక్టర్ సందీప్ అవతార్ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సలు జరిగాయి. ఇలాంటి సందర్భం ఆసియాలోనే తొలిసారి అని దవాఖాన వైద్యులు తెలిపారు. తొలి జత ఊపిరితిత్తులను హైదరాబాద్లో బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించారు.
రెండో జత గుజరాత్లోని అహ్మదాబాద్లో సేకరించి చార్టెడ్ విమానంలో తీసుకొచ్చారు. ఈ రెండు శస్త్రచికిత్సలు బుధవారం సాయంత్రం చేయగా, మూడోది ఏపీలోని విశాఖపట్నంలో సేకరించి విమానం ద్వారా తరలించి గురువారం ఉదయం సర్జరీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సందీప్ అవతార్ మాట్లాడుతూ.. 12 మంది ప్రత్యేక వైద్య నిపుణులు, అనుభవజ్ఞులైన నర్సింగ్ సిబ్బందితో కలిసి ఊపిరితిత్తులను 6-8 గంటల్లోనే రోగులకు అమర్చినట్టు తెలిపారు. ఇందుకు మూడు రాష్ర్టాలు పూర్తి సహకారం అందించాయని ఆయన వెల్లడించారు.