తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 64,586 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.3.9 కోట్లు వచ్చిందని తెలిపారు. నిన్న తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో గల అక్కదేవతల గుడిలో ఏడుగురు అక్కదేవతలకు పూజ ఘనంగా నిర్వహించారు. టీటీడీ విభాగం ఆధ్వర్యంలో ఉదయం జరిగిన ఈ పూజ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అక్కదేవతల గుడిని పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నడకదారి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ రవాణా విభాగం జనరల్ మేనేజర్ శేషారెడ్డి, డీఐలు జానకిరామిరెడ్డి, మోహన్, డ్రైవర్లు, రవాణా విభాగం సిబ్బంది పాల్గొన్నారు.