శాస్ర్తోక్తంగా నిత్యపూజలు
ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ
శ్రీవారి ఖజానాకు రూ.11,68,033 ఆదాయం
యాదాద్రి, జనవరి 28 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. స్వామి, అమ్మవార్లకు సహస్రనామ పఠనాలతో అర్చకబృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. పాంచరాత్రగమ శాస్త్ర ప్రకారం సుమారు రెండు గంటల పాటు లక్ష పుష్పార్చన పూజా పర్వాలు కొనసాగాయి. పూజల్లో దేవస్థాన ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, వేద పండితులు, అర్చకబృందం, పర్యవేక్షకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ..
స్వామివారి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా పాల్గొనే ఊంజల్ సేవలో మహిళా భక్తులు పాల్గొని తరించారు. సకల సంపదల సృష్టికర్త… తనను కొలిచిన వారికి నేనున్నానంటూ అభయ హస్తమిచ్చి కాపాడే శ్రీలక్ష్మీ అమ్మవారికిని విశేష పుష్పాలతో అలంకరించారు. బాలాలయం ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా 600 రూపాయల టిక్కెట్ తీసుకున్న భక్తులకు సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. దీన్నే సువర్ణపుష్పార్చనగా భక్తులు అత్యంత ప్రీతికరంగా నిర్వహిస్తారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు. ముత్తయిదువులు మంగళహారతులతో అమ్మవారిని స్థుతిస్తూ పాటలు పాడుతూ సేవలో ముందు నడిచారు. తిరువీధిసేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మండపంలోని ఊయలలో శయనింపు చేయించారు. గంటపాటు వివిధ పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటల కోలాహలం కొనసాగింది.
స్వామివారి సేవలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి సేవలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు ఏఎస్ బోన్స్లే పాల్గొని తరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం ఇవ్వగా, ఆలయ ఏఈఓ గట్టు శ్రవణ్కుమార్ స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
ఆర్జిత పూజల కోలాహలం
ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం నాలుగు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని విభాగాల నుంచి రూ. 11,68,033 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.