కొత్తగూడెం క్రైం, నవంబర్ 13: మహారాష్ట్రలోని గడ్చిరోలి మళ్లీ నెత్తురోడింది. తుపాకుల మోతతో అడవంతా దద్దరిల్లింది. ధనోరా మండలంలోని అటవీ ప్రాంతంలో శనివారం మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య భీకర పోరు సాగింది. ఉదయం 6 గంటల సమయంలో ప్రారంభమైన కాల్పులు సాయంత్రం 4 గంటల దాకా ఆగలేదు. సుమారు పది గంటల పాటు సాగిన సుదీర్ఘ ఎన్కౌంటర్లో 26 మంది నక్సలైట్లు హతమయ్యారు. నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హెలికాప్టర్ సాయంతో నాగ్పూర్లోని దవాఖానకు తరలించారు. ‘ఇప్పటివరకు 26 మంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకొన్నాం. వారు ఎవరనేది ఆదివారం గుర్తిస్తాం’ అని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ తెలిపారు. మృతుల్లో బీమా కోరేగావ్ కేసులో నిందితుడు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్ తేల్తుంబ్డే ఉన్నట్టు వార్తలు వచ్చాయి. శనివారం జరిగిన ఎన్కౌంటర్ గడ్చిరోలి చరిత్రలో అత్యంత సుదీర్ఘమైనదిగా భావిస్తున్నారు. అంతే కాదు మృతుల పరంగా కూడా ఇది రెండో అతి పెద్ద ఘటన. 2018 ఏప్రిల్ 23న గడ్చిరోలిలో ఎదురుకాల్పుల్లో 40 మంది నక్సలైట్లు హతమయ్యారు.
పక్కా సమాచారంతోనే ఆపరేషన్
ఛత్తీస్గఢ్-మహారాష్ట్ర సరిహద్దులో ధనోరా అడవిలో మావోయిస్టులు క్యాంపు వేశారన్న కచ్చితమైన సమాచారంలో దాదాపు 500 మంది సీ-60 కమాండోలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్టు సమాచారం. ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు ప్రారంభం అయ్యాయి. బలగాల ధాటికి తాళలేక మావోయిస్టులు అక్కడి నుంచి కాల్పులు జరుపుతూనే పారిపోయారు. కాల్పులు ముగిసిన అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని గాలింపు చేపట్టాయి. ఈ ఏడాది మే నెలలో గడ్చిరోలి జిల్లాలోని ఎటపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 13 మంది మావోయిస్టులు హతమయ్యారు.